Pinarai Vijayan: ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు: కేరళ సీఎం పినరయి విజయన్

  • ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూర్తి కాని కౌంటింగ్
  • ఆరు నగర పాలికల్లో ఐదు ఎల్డీఎఫ్ సొంతం
  • ఇది ప్రజా విజయమన్న పినరయి విజయన్
LDF Victory is Befitting Reply to BJP Says Pinarai Vijayan

కేరళ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం అధికార ఎల్డీఎఫ్ నేత, సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు వంటివని, ప్రజలు బీజేపీ వెంట లేరని స్పష్టమవుతోందని అన్నారు. ఓట్ల కౌంటింగ్ పలుచోట్ల ఇంకా కొనసాగుతూనే ఉన్నా, ట్రెండ్స్ మాత్రం స్పష్టమయ్యాయి. మొత్తం 941 గ్రామ పంచాయతీల్లో 541 పంచాయతీలను, 14 జిల్లా పంచాయతీల్లో పదకొండింటిని, ఆరు నగర పాలక సంస్థల్లో ఐదింటిని ఎల్డీఎఫ్ సొంతం చేసుకోనుందని పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. ఇది ప్రజా విజయమని ఆయన అన్నారు.

బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించడం ద్వారా లబ్దిని పొందాలని చూసిందని ఆరోపించిన ఆయన, అయితే, రాష్ట్ర ప్రజలు మాత్రం బీజేపీకి తలుపులు తీయలేదని అన్నారు. ఇదే సమయంలో యూడీఎఫ్ అవకాశవాద రాజకీయాలను సైతం ప్రజలు తిరస్కరించారని అన్నారు.

కాగా, అందుబాటులోని తాజా సమాచారం ప్రకారం, గ్రామ పంచాయతీల్లో 376, జిల్లా పంచాయతీల్లో 4, మునిసిపాలిటీల్లో 45, బ్లాక్ పంచాయతీల్లో 108 స్థానాలలో ఎల్డీఎఫ్ తన విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇక బీజేపీ 38 గ్రామ పంచాయతీలు, నాలుగు మునిసిపాలిటీలకు పరిమితమైంది.

More Telugu News