Lunar: రాళ్లు, మట్టితో చంద్రుడి నుంచి భూమికి బయలుదేరిన చైనా వ్యోమనౌక

  • నాలుగు దశాబ్దాల విరామం తర్వాత చంద్రుడిపైకి చైనా ప్రోబ్
  • రెండు కేజీల మట్టి, రాళ్లతో భూమిపైకి పయనం
  • చంద్రుడి గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు అవకాశం
Chinese capsule with 2kg of moon rocks begins journey to Earth

చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చైనా వ్యోమనౌక అక్కడి రాళ్లు, మట్టితో తిరిగి భూమికి పయనమైంది. మూడు రోజుల్లో ఇది భూమిని చేరుకుంటుంది. ఈ మేరకు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చాంగే-5లోని నాలుగు ఇంజన్లను 22 నిమిషాలపాటు యాక్టివేట్ చేసిన అనంతరం వ్యోమనౌక భూమిపైకి బయలుదేరినట్టు పేర్కొంది. దాదాపు రెండు కిలోల మట్టి, రాళ్లతో ఉత్తర చైనా ప్రాంతంలో ఇది ల్యాండ్ కానుంది.

అది సేకరించి తీసుకొస్తున్న మట్టి, రాళ్లను విశ్లేషించడం ద్వారా  గతంలో అంతుచిక్కని విషయాలతోపాటు చంద్రుడి గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాల విరామం తర్వాత చైనా ఇటీవల చంద్రుడిపైకి విజయవంతంగా ల్యాండర్‌ను పంపింది. ఈ నెల మొదట్లో అది చంద్రుడి ఉపరితలంపై దిగి 4.4 పౌండ్ల మట్టి, రాళ్లను సేకరించింది.

సోవియట్ యూనియన్‌కు చెందిన లూనా 24 ప్రోబ్ 1976లో భూమిపైకి జాబిల్లి నమూనాలు తీసుకురాగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు చైనా ప్రోబ్ నమూనాలతో భూమిపైకి బయలుదేరింది. అమెరికా, సోవియట్ యూనియన్ల మిషన్లు భూమికి తీసుకొచ్చిన నమూనాలతో పోలిస్తే చైనా క్యాప్సుల్ మోసుకొస్తున్న నమూనాలు కొన్ని బిలియన్ల సంవత్సరాల తక్కువ వయసున్నవి కావచ్చని చెబుతున్నారు.

More Telugu News