India: స్మారక స్టాంపుల విషయంలో చైనా అబద్ధాలు చెబుతోంది: భారత్

  • ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏడు దశాబ్దాలు పూర్తి
  • గుర్తుగా స్మారక స్టాంపులు విడుదల చేయాలని నిర్ణయం
  • భారత్ వల్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నామన్న చైనా
  • చైనా వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్న భారత్
india says china claim factually incorrect jointly release stamp

భారత్-చైనా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడి ఏడు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో  స్మారక స్టాంపులు విడుదల చేయాలని ఇరు దేశాలు గతేడాది ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. అయితే, ఏడాది గడుస్తున్నా ఈ విషయంలో చైనా నుంచి ఎటువంటి ప్రకటన లేదు.

భారత్ కారణంగానే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు చైనా దౌత్యకార్యాలయం తాజాగా చేసిన ట్వీట్‌పై భారత్ మండిపడింది. అయితే, చైనా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 70వ వార్షికోత్సవానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు మొదలు కానప్పుడు ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ ప్రస్తావన ఎలా వస్తుందని ప్రశ్నించారు.


 కాగా, మంగళవారం ‘బ్యూటిఫుల్ ఇండియా’, ‘బ్యూటిఫుల్ చైనా’ పేరిట చైనా  ఆన్‌లైన్ ఫొటో  ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో  చైనా రాయబారి సన్ వెడాంగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్మారక స్టాంపుల విడుదల అంశంపై వివాదం చెలరేగింది. వార్షికోత్సవ వేడుకలకు ఇది ఆరంభమని చైనా పేర్కొంది. అయితే, చైనా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. వేడుకలు అసలు మొదలే కాలేదని తేల్చి చెప్పింది.

More Telugu News