Nara Lokesh: నల్లారి కిషోర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన నారా లోకేశ్

  • మదనపల్లి సమీపంలో కిషోర్ రెడ్డిపై దాడి
  • ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్న లోకేశ్
  • టీడీపీ చేస్తున్న పోరాటాలు కొనసాగుతాయని వ్యాఖ్య
Nara Lokesh phones to Nallari Kishore Kumar Reddy

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. మదనపల్లి సమీపంలో ఆయనపై దాడి జరిగింది. ఆ సమయంలో ఆయనతో పాటు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారు. సమయానికి పోలీసులు రంగంలోకి దిగడంతో వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఈ నేపథ్యంలో కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేశ్ ఫోన్ చేశారు. జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారా లోకేశ్ ఈ ఘటనపై స్పందిస్తూ, వైసీపీ దాడులను ఖండిస్తున్నామని  చెప్పారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజాసమస్యలపై టీడీపీ చేస్తున్న పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. కిషోర్ పై దాడికి యత్నించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని అన్నారు. అయితే ఈ ఘటనపై చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు, ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే కిషోర్ పై వైసీపీ దాడికి యత్నించిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

More Telugu News