Bumrah: ప్రాక్టీసు మ్యాచ్ లో బుమ్రా ఫిఫ్టీ... 'గార్డ్ ఆఫ్ ఆనర్' తో గౌరవించిన టీమిండియా సభ్యులు

  • సిడ్నీలో పింక్ బాల్ ప్రాక్టీసు మ్యాచ్
  • ఆస్ట్రేలియా-ఏ జట్టుపై టాస్ గెలిచిన భారత్
  • 48.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్
  • 55 పరుగులతో అజేయంగా నిలిచిన బుమ్రా
  • బుమ్రా స్కోరులో 6 ఫోర్లు, 2 సిక్సులు
Bumrah registered his maiden fifty

సిడ్నీ మైదానంలో టీమిండియా, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ ప్రాక్టీసు మ్యాచ్ సందర్భంగా ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమైన చోట బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాట్ తో అద్భుతంగా రాణించాడు. ఇది మూడ్రోజుల మ్యాచే అయినా వన్డే తరహాలో ఆడి అలరించాడు. మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న బుమ్రా 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బుమ్రా స్కోరులో 6 ఫోర్లు, 2 సిక్సులున్నాయి.

బుమ్రా అర్ధసెంచరీ పూర్తిచేసుకోవడంతో డ్రెస్సింగ్ రూములో నవ్వులు విరబూశాయి. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి తదితరులు బుమ్రా బ్యాటింగ్ జోరుకు ఫిదా అయ్యారు. ఇక, చివరి వికెట్ గా మహ్మద్ సిరాజ్ (22) అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. సిరాజ్ తో కలిసి బుమ్రా డ్రెస్సింగ్ రూములోకి వస్తుండగా టీమిండియా సభ్యులు తమ చేతులు పైకెత్తి 'గార్డ్ ఆఫ్ ఆనర్' ప్రకటించి బుమ్రాను గౌరవించారు. మొత్తమ్మీద ఇవాళ్టి ఆటలో బుమ్రా బ్యాటింగే హైలైట్ అయింది.

సిడ్నీ మైదానంలో జరుగుతున్న ఈ ప్రాక్టీసు మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పృథ్వీ షా 40, శుభ్ మాన్ గిల్ 43 పరుగులు చేశారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 2, హనుమ విహారి 15, కెప్టెన్ అజింక్యా రహానే 4, రిషభ్ పంత్ 5, వృద్ధిమాన్ సాహా 0, సైనీ 4, షమీ 0 పరుగులకు వెనుదిరిగారు. ఆస్ట్రేలియా-ఏ జట్టు బౌలర్లలో షాన్ అబ్బాట్ 3, జాక్ విల్డర్ మూత్ 3 వికెట్లతో రాణించారు.

More Telugu News