Italy: భార్యపై అలిగి.. 450 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయిన భర్త!

  • ఇటలీలో ఘటన
  • భార్యతో గొడవపడిన భర్త
  • భార్యను ఏమీ చేయలేక 450 కిమీ నడిచిన భర్త
  • ఏడ్రియాటిక్ సముద్రతీరంలో నిలువరించిన పోలీసులు
  • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫైన్
Italian Man walks hundreds of kilometres after brawl with wife

కాపురం అన్న తర్వాత భార్యాభర్తల మధ్య కలహాలు సహజం! ఎంత కలహాలు వచ్చినా కాస్సేపటికే సర్దుకుపోతూ తమ కాపురాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లేది కొందరైతే, చీటికి మాటికి అలుగుతూ, దాంపత్యాన్ని మరింత జటిలం చేసుకునేది మరికొందరు! ఇక, ఇటలీలో ఓ వ్యక్తి భార్యపై అలిగి... వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఇటలీలోని కోమో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇటీవల భార్యతో గొడవపడ్డాడు. అయితే భార్యను ఏమీ చేయలేక, తన కోపాన్ని అణచుకునేందుకు పాదయాత్ర మొదలుపెట్టాడు. దాదాపు 450 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. వారం రోజుల తర్వాత చివరికి ఏడ్రియాటిక్ సముద్రతీర ప్రాంతంలోని ఫానో బీచ్ రిసార్టుకు చేరుకున్నాడు.

అయితే, కరోనా పరిస్థితుల కారణంగా ఇటలీలో లాక్ డౌన్ అమల్లో ఉండడంతో, అనవసరంగా బయట తిరుగుతున్న ఆ వ్యక్తికి పోలీసులు జరిమానా విధించారు. అతడి నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు అతడి పాదయాత్ర వెనకున్న కారణం తెలుసుకుని విస్తుపోయారు. అటు, అతడి భార్య తన భర్త కనిపించడంలేదంటూ కోమో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, ఆ వ్యక్తి పోలీసులతో మాట్లాడుతూ, తాను ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చేసిన విషయం గుర్తించనేలేదని తెలిపాడు. దార్లో ప్రజలు ఇచ్చిన ఆహారం తింటూ వచ్చేశానని వివరించాడు. పోలీసులు అతడ్ని ఓ హోటల్ లో ఉంచగా, మరునాడు అతని భార్య వచ్చి తీసుకెళ్లింది.

More Telugu News