భారీ రేటుకి అమ్ముడైన రష్మిక 'పొగరు' హక్కులు!

Rashmikas kannda film Pogaru Telugu rights sold for a bomb
  • రష్మిక, ధ్రువ్ సర్జా జంటగా కన్నడలో 'పొగరు' 
  • తెలుగు వెర్షన్ హక్కులు 3.3 కోట్లకు విక్రయం  
  • 'కరాబు మైండు' పాటకి మిలియన్లలో వ్యూస్  
  • తెలుగు, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్
ప్రెట్టీ హీరోయిన్ రష్మిక మందన్నకు ఈవేళ తెలుగులో వున్న క్రేజే వేరు. వరుస విజయాలతో అగ్రతారగా ఇప్పుడు రాణిస్తోంది. స్టార్ హీరోలు సైతం ఆమెను బుక్ చేయమని నిర్మాతలకు రికమండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె కన్నడలో 'పొగరు' అనే సినిమాలో నటిస్తోంది. ధ్రువ్ సర్జా కథానాయకుడుగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని కూడా ఏకకాలంలో నిర్మిస్తున్నారు. దీంతో రష్మికకున్న క్రేజ్ ను బట్టి ఈ చిత్రం తెలుగు హక్కులు 3 కోట్ల 30 లక్షల ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని చిత్రం హక్కులు తీసుకున్న వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత డి.ప్రతాప్ రాజు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆయన సాయిసూర్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు.

ఇక ఈ చిత్రంలోని 'కరాబు మైండు కరాబు, మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు' అంటూ సాగే పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు. కన్నడ వెర్షన్ లో ఈ పాటకు యూట్యూబ్ లో 170 మిలియన్ వ్యూస్ వచ్చాయని, తెలుగు పాటకి 43 మిలియన్ వ్యూస్ వచ్చాయని నిర్మాత ప్రతాప్ రాజు చెప్పారు. ఈ పాటకి ఇంత క్రేజ్ రావడం వల్లే సినిమా హక్కులకు పోటీ ఏర్పడిందనీ, తాము 3.3 కోట్లు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకున్నామని ఆయన తెలిపారు.

పోతే, కన్నడలో ఈ సినిమా టైటిల్ 'పొగరు' అనీ, తెలుగు వెర్షన్ కి ఇంకా టైటిల్ నిర్ణయించలేదని ఆయన చెప్పారు. కాగా, వచ్చే ఏడాది తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Go Back to Shorts
Rashmika Mandanna
Dhruv Sarja
Kannada

More Telugu News