Rajinikanth: తమిళ ప్రజల తలరాతల్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది: రజనీకాంత్

  • రాజకీయ రంగప్రవేశంపై రజనీ స్పష్టత
  • ఈ నెలాఖరున పార్టీ ప్రకటన
  • డాక్టర్లు వద్దంటున్నా వస్తున్నానని వెల్లడి
  • తమిళ ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని ఉద్ఘాటన
Superstar Rajinikanth says time has come to change the fate of Tamil people

గత కొంతకాలంగా రజనీకాంత్ రాజకీయ పార్టీ విషయంలో ఉన్న సందిగ్ధత నేటితో తొలగిపోయింది. ఈ నెలాఖరున పార్టీ ప్రకటన ఉంటుందని రజనీ స్వయంగా వెల్లడించడంతో తమిళనాడు వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాదరణ తమకే ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడులో ఇకపై ఆశ్చర్యపరిచే అద్భుతాలు జరుగుతాయని, కులమతాలకు అతీతంగా నీతిమంతమైన ఆధ్యాత్మిక రాజకీయాలు, పాలన తమ నుంచి ఆశించవచ్చని తెలిపారు.

మారుస్తాం... అన్నింటినీ మారుస్తాం అంటూ తలైవా తన అభిమానుల్లో కొత్త ఉత్సాహం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ మార్పు రాదని ఉద్ఘాటించారు. తమిళ ప్రజల తలరాతల్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తున్నారని, కానీ తమిళనాడు కోసం జీవితాన్ని త్యాగం చేసేందుకైనా తాను సిద్ధమేనని, తమిళ ప్రజల కోసం సంతోషంగా ప్రాణాలు ఇచ్చేస్తానని పేర్కొన్నారు. వైద్యులు వద్దంటున్నా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యటించాలని భావించినా, కరోనా వ్యాప్తి కారణంగా వీలుపడలేదని వివరించారు.

More Telugu News