Bombay High Court: ముగిసిన 94 ఏళ్ల లక్ష్మీ విలాస్ బ్యాంకు ప్రస్థానం!

  • డీబీఐఎల్‌లో విలీనం ప్రక్రియ పూర్తి
  • నిన్నటి నుంచే కొత్త బ్యాంకుగా సేవలు
  • విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
Lakshmi Vilas Bank merger completes in DBS

94 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ) ప్రస్థానం నిన్నటితో ముగిసింది. ఇటీవల నష్టాల్లో కూరుకుపోయిన ఈ బ్యాంకు స్వాతంత్య్రానికి పూర్వం నుంచే దేశంలో సేవలు అందిస్తోంది. తమిళనాడుకు చెందిన ఎల్‌వీబీ.. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌ (డీబీఐఎల్)లో విలీనమైంది. ఫలితంగా నిన్నటి నుంచే అది డీబీఎస్ బ్యాంకు ఇండియాగా సరికొత్త సేవలు ఆరంభించింది. ఎల్‌వీబీ శాఖలన్నీ ఇకపై డీబీఐఎల్ శాఖలుగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలిపింది. అలాగే, ఎల్‌వీబీపై ఆర్‌బీఐ ఇటీవల విధించిన మారటోరియాన్ని శుక్రవారం ఎత్తివేసినట్టు పేర్కొంది.

ఎల్‌వీబీ విలీన ప్రక్రియ కారణంగా ఆ బ్యాంకు షేర్లను స్టాక్ ఎక్చేంజీల నుంచి తొలగించడంతో వాటాదార్ల విలువ శూన్యమైంది. దీంతో ఆగ్రహంతో ఉన్న వాటాదార్లు, బ్యాంకు యూనియన్లు ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లక్ష్మీవిలాస్ బ్యాంకును ఓ విదేశీ బ్యాంకుకు ఆర్‌బీఐ ఉచిత బహుమతిగా ఇచ్చేసిందంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, విలీనాన్ని తక్షణం నిలిపివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే, వారి పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

More Telugu News