TRS: సపోటాబాగ్ లో టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని అడ్డుకున్న ఎంఐఎం.. ఉద్రిక్తత

  • టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న ఎంఐఎం
  • ముస్లింల ప్రాంతంలో ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్న
  • పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు
MIM tries to block TRS campaign in Hyderabad old city

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వంలో ఆసక్తికర సన్నివేశాలు, ఊహించని సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. మంచి మిత్రులుగా పేరుగాంచిన టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఓల్డ్ సిటీలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ ప్రచారానికి ఎంఐఎం శ్రేణులు అడ్డుపడుతున్నాయి. తాజాగా అక్బర్ బాగ్ డివిజన్ సపోటాబాగ్ లో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

సపోటాబాగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి పార్టీ శ్రేణులు, అనుచరులతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. మైనార్టీ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉండే సపోటాబాగ్ లో ప్రచారాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తమ ప్రచారాన్ని తమను నిర్వహించుకోనివ్వండని టీఆర్ఎస్ నేతలు ఎంత చెప్పినా వారు వినలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న సైదాబాద్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతపరిచారు. అనంతరం టీఆర్ఎస్ నేతలు అక్కడ ప్రచారాన్ని కొనసాగించారు.

మరోవైపు తమ మధ్య ఎలాంటి పొత్తు లేదని టీఆర్ఎస్, ఎంఐఎం ఇప్పటికే స్పష్టం చేశాయి. ఎంఐఎంకు మేయర్ పదవిని అప్పగించేందుకు మేమేమైనా పిచ్చోళ్లమా? అని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

More Telugu News