Rita Bahuguna Joshi: బీజేపీ మహిళా ఎంపీ కుటుంబంలో విషాదం... టపాసులు పేలి మనవరాలి మృతి

  • శోకసంద్రంలో ప్రయాగ్ రాజ్ ఎంపీ రీటా బహుగుణ కుటుంబం
  • దుస్తులకు నిప్పంటుకుని ఆరేళ్ల కియా మరణం
  • టపాసుల మోతలో వినిపించని చిన్నారి అరుపులు
Tragedy in BJP MP family

దీపావళి పండుగ ఓ బీజేపీ మహిళా ఎంపీ కుటుంబలో విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ఎంపీ రీటా బహుగుణ జోషి మనవరాలు దీపావళి వేడుకల్లో ప్రమాదానికి గురై కన్నుమూసింది. అది కూడా తన ఇంట్లోనే ఆ ప్రమాదం జరగడంతో ఎంపీ రీటా బహుగుణ జోషి  తీవ్ర వేదనకు గురవుతున్నారు.

ప్రయాగ్ రాజ్ లోని ఎంపీ నివాసంలో దీపావళి రోజున రాత్రి అందరూ టపాసులు కాల్చుతున్నారు. జోషి ఆరేళ్ల మనవరాలు కియా భవనం టెర్రస్ పైకి వెళ్లి టపాసులు కాల్చే ప్రయత్నం చేసింది. అయితే, నిప్పురవ్వలు ఆమె దుస్తులకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి.

ఇతర కుటుంబ సభ్యులందరూ బాణసంచా కాల్చుతుండడంతో ఆ మోతలో కియా అరుపులు ఎవరికీ వినిపించలేదు. కొంతసేపటి తర్వాత గమనిస్తే కాలిన గాయాలతో కియా టెర్రస్ పై పడివుంది. దాంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ తరలించే ఏర్పాట్లలో ఉండగానే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఆరేళ్ల కియా ఇటీవలే కరోనా నుంచి కోలుకుంది.

More Telugu News