Hyderabad: దీపావళి టపాసు పేలి దగ్ధమైన రూ. 14 లక్షల విలువైన కొత్తకారు!

  • హైదరాబాద్ శివారులో ఘటన
  • దీపావళి చేసుకుందామని కారులో స్నేహితుల వద్దకు వచ్చిన బాధితుడు
  • క్షణాల్లోనే కాలి బూడిదైన కారు
car burnt in shamshabad while celebrating diwali

సుత్లీబాంబు (టపాసు) పేలి ఓ కారు దగ్ధమైన ఘటన హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని తొండుపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్‌పల్లి మండలం మోకిలకు చెందిన ఓ యువకుడు రెండు నెలల క్రితం 14 లక్షలతో ఓ కారును కొనుగోలు చేశాడు. ఆదివారం స్నేహితులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు ఆ కారులో తొండుపల్లిలోని స్నేహితుల వద్దకు వచ్చాడు. కారును ఇంటి బయట పార్క్ చేసి లోపలికి వెళ్లాడు.

ఆ తర్వాత కాసేపటికే పెద్ద ఎత్తున మంటలు వస్తుండడంతో వెలుపలికి వచ్చి చూసిన అతడు నిర్ఘాంతపోయాడు. కారు మంటల్లో కాలి బూడిదవుతుండడంతో తట్టుకోలేకపోయాడు. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షణాల్లోనే అది బూడిదైంది. అదే బస్తీకి చెందిన వేణు అనే వ్యక్తి సుత్లీబాంబు కాల్చి కారు పైకి విసరడంతో మంటలు చెలరేగినట్టు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News