Kapil Sibal: మా పార్టీ దగ్గరకు ప్రజలు వచ్చే పరిస్థితి లేదు: కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ తీవ్ర వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది
  • సమస్యలను సీడబ్ల్యూసీ అధికారికంగా గుర్తించలేదు
  • సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే సంస్కృతి పోవాలి
Kapil Sibal comments on his own party Congress

బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. కూటమిలోని ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే... కాంగ్రెస్ మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేక సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తన పార్టీ భవిష్యత్తుపై సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీహార్ లో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఏమాత్రం భావించడం లేదని ఆయన అన్నారు. పార్టీ దగ్గరకు ప్రజలు వచ్చే పరిస్థితి లేదని... ప్రజల వద్దకే పార్టీ వెళ్లాలని చెప్పారు. యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పార్టీకి 2 శాతం కంటే తక్కువ ఓట్లు పడటం పార్టీ దుస్థితిని సూచిస్తోందని అన్నారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్టీలోని అంతర్గ విభేదాలను పక్కన పెట్టేయాలని... పూర్తి స్థాయిలో పార్టీని పక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సిబాల్ చెప్పారు. ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోలేదని... ఇకపై చేసుకుంటుందన్న నమ్మకం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఉన్న సమస్య ఏమిటో అందరికీ తెలుసని, వాటికి సమాధానాలు, పరిష్కార మార్గాలు కూడా తెలుసని... అయితే వాటిని అధికారికంగా గుర్తించడానికి వారు ఇష్టపడటం లేదని విమర్శిచారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ గ్రాఫ్ పడిపోతుందని  చెప్పారు.

పార్టీ దుస్థితికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కారణమని సిబాల్ చెప్పారు. సీడబ్ల్యూసీని ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే సంస్కృతి పోవాలని చెప్పారు. ఎన్నికల్లో వరుసగా పరాభవం ఎదుర్కొంటున్న కాంగ్రెస్ దుస్థితిని మార్చే పరిష్కారం సీడబ్ల్యూసీ సభ్యుల నుంచి వస్తుందని ఆశించలేమని అన్నారు.

పార్టీలో పరిస్థితి గురించి ఇదివరకు అధిష్ఠానానికి లేఖ రాస్తే... అది రాసిన సభ్యులతో కనీసం ఎవరూ మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని సిబాల్ చెప్పారు. దీని వల్ల తన వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పడానికి ఒక వేదిక లేకుండా పోయిందని అన్నారు. దేశాన్ని పక్కదోవ పట్టిస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం చూపిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తాను కాంగ్రెస్ వ్యక్తినని... భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ లోనే ఉంటానని తెలిపారు.

More Telugu News