Denmark: ప్రపంచం ముందు మరో సవాల్.. మింక్‌లోకి ప్రవేశించిన కరోనా వైరస్, తిరిగి మానవులకు సంక్రమణ

  • డెన్మార్క్‌లో మింక్ నుంచి మనుషులకు సంక్రమించిన వైరస్
  • 1.7 కోట్ల మింక్‌లను చంపేయాలని ప్రభుత్వం ఆదేశం
  • కొత్త పరివర్తనకు ‘వై453ఎఫ్’గా నామకరణం
Corona virus mutated as y453f

కరోనా మహమ్మారి భయాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ మరో కొత్త ఉపద్రవం వచ్చి పడింది. కొవిడ్-19కు కారణమయ్యే సార్స్‌కోవ్-2 వైరస్  మింక్ అనే మాంసాహార క్షీరదాల్లోకి ప్రవేశించింది. అనంతరం ఉత్పరివర్తన (మ్యుటేషన్) చెంది తిరిగి మానవులకు సంక్రమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ఉత్పరివర్తన ఎక్కువగా డెన్మార్క్‌లో కనిపిస్తోంది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం పెంపకం కేంద్రాల్లో పెరుగుతున్న 1.7 కోట్ల మింక్‌లను చంపేయాలని ఆదేశించింది.

వైరస్ ఉత్పరివర్తన వల్ల ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న కరోనా టీకాలు సమర్థవంతంగా పనిచేయకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్‌కు సంబంధించిన ఈ సరికొత్త మార్పునకు ‘వై453ఎఫ్’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. మార్పు సంతరించుకున్న వైరస్ భారత్‌లో ప్రవేశించలేదని ఆస్ట్రేలియాలో కొవిడ్-19 పరిశోధనలకు సారథ్యం వహిస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ శేషాద్రి వాసన్ తెలిపారు.

కరోనా వైరస్ ఇప్పటికే ‘డి614జి’గా ఉత్పరివర్తన చెందిందని, దీనివల్ల టీకాలపై ఎటువంటి ప్రభావం ఉండబోదన్న ఆయన.. ‘వై453ఎఫ్’ గురించి మాత్రం ఇప్పటికిప్పుడు ఓ అంచనాకు రాలేమన్నారు. 1,97,274 వైరస్ జన్యుక్రమాలను విశ్లేషించగా, 387 కేసుల్లో ఉత్పరివర్తన కనిపించినట్టు చెప్పారు. వీటిలో 340 కేసులు మానవుల్లోను, 42 కేసులు అమెరికన్ మింక్‌లలో, ఐదు ఐరోపా మింక్‌లలో వెలుగుచూసినట్టు ప్రొఫెసర్ శేషాద్రి వివరించారు.

సాధారణంగా వైరస్‌లు ఇతర జీవుల్లోకి ప్రవేశించి తమ సంతతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. నిజానికి వీటివల్ల ఎటువంటి హానీ ఉండదు. అయితే, మానవుల నుంచి మింక్‌లోకి ప్రవేశించి, తిరిగి మానవుల్లోకి ప్రవేశించడం వల్ల ఎక్కువ మార్పులకు లోనై ఉంటుందని భావిస్తున్నారు. దీనికితోడు మానవుల్లోకి ప్రవేశించడానికి ఈ వైరస్ ‘స్పైక్ ప్రొటీన్’ను వాహకంగా ఎంచుకుంటుంది. ఇప్పుడు అందులోనే మార్పు కనిపించడం శాస్త్రవేత్తల ఆందోళనకు కారణం అవుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది దశలో ఉన్న కరోనా టీకాలన్నీ స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకున్నవే. ఇప్పుడు అందులోనే ఉత్పరివర్తన జరగడంతో వాటి పనితీరుపై ఆందోళన నెలకొంది.

More Telugu News