Delhi Capitals: ఐపీఎల్ ఫైనల్: అర్ధసెంచరీలతో రాణించిన పంత్, అయ్యర్... ఢిల్లీ స్కోరు 156/7

  • ముంబయి, ఢిల్లీ మధ్య ఐపీఎల్ ఫైనల్
  • మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
  • 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
  • ఆదుకున్న అయ్యర్, పంత్ జోడీ
Delhi Capitals posted normal score against Mumbai Indians in IPL summit clash

ముంబయి ఇండియన్స్ తో ఐపీఎల్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (65 నాటౌట్), రిషబ్ పంత్ (56) అర్ధసెంచరీలు నమోదు చేశారు. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును అయ్యర్, పంత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు ఉరకలేసింది.

అయితే పంత్ అవుటయ్యాక వచ్చిన హెట్మెయర్ (5), అక్షర్ పటేల్ (9) రాణించకపోవడంతో ఢిల్లీ భారీస్కోరు సాధించలేకపోయింది. మరో ఎండ్ లో అయ్యర్ ఉన్నా ఉపయోగం లేకపోయింది. చివరి ఓవర్లలో ఆ జట్టు పరుగుల వేగం బాగా మందగించింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. నాథన్ కౌల్టర్ నైల్ కు 2, జయంత్ యాదవ్ కు 1 వికెట్ లభించాయి.

కాగా, ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభంలో కుదుపులు చోటుచేసుకున్నాయి. క్వాలిఫయర్స్-2లో సన్ రైజర్స్ పై వీరబాదుడు బాదిన స్టొయినిస్ ఈసారి తుస్సుమనిపించాడు. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఆడిన తొలిబంతికే వెనుదిరిగాడు. ధావన్ (15), రహానే (2) కూడా విఫలమయ్యారు.

More Telugu News