Dubbaka: దుబ్బాకలో దుమ్మురేపేదెవరు?: నేడు ఓట్ల లెక్కింపు.. సర్వత్ర ఉత్కంఠ

  • 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
  • మధ్యాహ్నం మూడు గంటలకల్లా పూర్తి ఫలితం
  • దుబ్బాకలో త్రిముఖ పోటీ
Dubbaka vote counting begin today

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీపడగా, ప్రధానపోటీ అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే నెలకొంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం రెండు హాళ్లలో మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

23 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా, 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వారు, కరోనా బాదితులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించారు. 1,453 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అలాగే, మొత్తంగా 1,64,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచారు. లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే ఓటింగ్ సరళి తేలిపోనుండగా, మధ్యాహ్నం మూడు గంటలకల్లా పూర్తి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో గెలుపు ఎవరిదన్న దానిపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

More Telugu News