Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన ఒడిశా తెలుగు ఎమ్మెల్యే నారాయణరావు

  • హైదరాబాదులో పవన్ తో భేటీ అయిన పర్లాఖెముండి ఎమ్మెల్యే
  • ఒడిశాలోని తెలుగు వారి సమస్యలపై చర్చ
  • జనసేన కూడా కలిసిరావాలని విజ్ఞప్తి
Odisha Telugu MLA Koduru Narayana Rao met Pawan Kalyan in Hyderabad

ఒడిశాలోని పర్లాఖెముండి (పర్లాకిమిడి) ఎమ్మెల్యే, గజపతి జిల్లా బీజేపీ చీఫ్ కోడూరు నారాయణరావు ఇవాళ హైదరాబాదులో జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒడిశాలోని తెలుగు వారి సమస్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఒడిశాలోని గజపతి జిల్లాలో తెలుగు వాళ్లు ఎక్కువ మంది ఉన్నారని, సరిహద్దు ప్రాంతాల్లో వారికి పలు సమస్యలు ఎదురవుతున్నాయని పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే నారాయణ రావు వివరించారు.  సమస్యల పరిష్కారానికి జనసేన కూడా కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశం అనంతరం నారాయణరావు మాట్లాడుతూ, తనకు చిరంజీవి అన్నా, పవన్ కల్యాణ్ అన్నా ఎంతో అభిమానమని వెల్లడించారు. ఒడిశాలో తెలుగువారి ప్రాబల్యం ఉన్న గజపతి జిల్లా గురించి పవన్ కల్యాణ్ కు వివరించానని, తమ విజ్ఞప్తి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సరిహద్దులకు రెండు వైపుల ఉన్న ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అయితే పాలనాపరమైన నిబంధనల వల్ల సమస్యలు వస్తున్న తీరును పవన్ కు వివరించానని పేర్కొన్నారు. కాగా, ఈ భేటీ సందర్భంగా నారాయణరావు పూరీ జగన్నాథుడి చిత్రపటాన్ని పవన్ కు బహూకరించారు.

More Telugu News