Nasscom: అమెరికాలో బైడెన్ గెలుపును స్వాగతించిన నాస్కామ్

  • అభినందనలు తెలిపిన భారత ఐటీ పరిశ్రమల సంఘం
  • బైడెన్ సర్కారుతో కలిసి పనిచేస్తామని వెల్లడి
  • కమల హారిస్ ప్రసంగాన్ని ప్రస్తావించిన నాస్కామ్ ప్రెసిడెంట్
Nasscom welcomes Joe Biden win as new president of United States of America

భారత ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ విజయకేతనం ఎగురవేయడం పట్ల స్పందించింది. బైడెన్ గెలుపును స్వాగతిస్తున్నట్టు నాస్కామ్ ఓ ప్రకటనలో తెలిపింది. బైడెన్ కు అభినందనలు తెలుపుతున్నట్టు నాస్కామ్ ట్విట్టర్ లో పేర్కొంది.

అమెరికాలో సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ రంగం అభివృద్ధి కోసం బైడెన్ ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ ట్వీట్ లో పేర్కొంది. అమెరికా నూతన పాలనా వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపింది.

కాగా, 2020-21 ఏడాదికి ఐటీ పరిశ్రమ 7.7 శాతం వృద్ధి సాధిస్తుందని, ఆదాయం రూ,14.13 లక్షల కోట్లకు చేరుకుంటుందని నాస్కామ్ వివరించింది. అదే సమయంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య భారీగా పెరగనుందని, 2 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉండడంతో ఈ రంగంలో ఉద్యోగ నిపుణుల సంఖ్య 43.6 లక్షలకు పెరగొచ్చని అంచనా వేసింది.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమల హారిస్ ఎన్నికవడం పట్ల నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్ సంతోషం వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత కమల చేసిన ప్రసంగం ప్రతి అమ్మాయికి  జీవితంలోని అనేక అవకాశాలను గుర్తు చేసేలా ఉందని పేర్కొన్నారు.

More Telugu News