Sadhvi Prachi: మసీదులో హోమం చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రాచి!

Sadhvi Prachi responds after Namaz offerings in a Madhura temple
  • మధురలో ఆలయంలో నమాజులు
  • ఘాటుగా స్పందించిన సాధ్వీ ప్రాచి
  • మసీదులు కూల్చి హోమాలు చేయాలంటూ పిలుపు
  • ఆపై తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న వైనం
ఉత్తరప్రదేశ్ లోని మధురలో నలుగురు వ్యక్తులు ఆలయంలో నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. దీనిపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నో నగరంలోని ఓ మసీదులో తాను హోమం చేస్తానంటూ ఘాటుగా స్పందించారు. సామాజిక మతసామరస్యం పేరిట ఓ ముఠా తన కార్యకలాపాలు కొనసాగిస్తోందని, ఈ ముఠా సభ్యులు ఆలయాల్లోకి వెళ్లి నమాజ్ లు చేస్తున్నారని ఆరోపించారు.

"వాళ్లు ఆ విధంగా చేస్తున్నప్పుడు హిందువులు కూడా మసీదులకు వెళ్లి హోమాలు చేయాలని మేం అనుకుంటున్నాం. ఆ విధంగా సామాజిక మత సామరస్యం నెలకొంటుందని భావిస్తున్నాం. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, అపవిత్రం చేసి ఆ మసీదులు నిర్మించారు. అందుకే ఆ మసీదులను కూల్చి అక్కడ హోమాలు చేయాలి. ఆ విధంగా నేనే చేస్తాను. లక్నోలోని ఓ పాత మసీదులో హోమం నిర్వహిస్తాను. తద్వారా వాయు కాలుష్యం తొలగిపోవడమే కాదు, సామాజిక మత సామరస్యం కూడా ఏర్పడుతుంది" అని వ్యాఖ్యానించారు.

సాధ్వీ ప్రాచి ఈ కార్యక్రమానికి బీజేపీ తదితర హిందుత్వ నేతలు రావాలంటూ ఆహ్వానించారు. కాగా, తన వ్యాఖ్యలను సాధ్వీ ప్రాచి కొన్నిగంటల్లోనే వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.
Sadhvi Prachi
Havan
Mosque
Namaz
Temple
VHP

More Telugu News