Velacity: సోఫీ సూపర్ స్పెల్... 47 పరుగులకే కుప్పకూలిన మిథాలీ సేన

  • 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన సోఫీ ఎకిల్ స్టోన్
  • 15.1 ఓవర్లలో ఆలౌటైన వెలాసిటీ జట్టు
  • అద్భుతంగా రాణించిన ట్రెయిల్ బ్లేజర్స్ బౌలర్లు
Velacity collapses after Sophie Ecclestone splendid spell

నిన్న 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఇవాళ 47 పరుగులకే కుప్పకూలుతుందని ఎవరూ అనుకుని ఉండరు. బుధవారం జరిగిన మహిళల ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో అద్భుత విజయం అందుకున్న మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ ఇవాళ అదే మైదానంలో పరుగుల కోసం అల్లాడిపోయింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్ స్టోన్ ధాటికి ప్రధాన బ్యాట్స్ ఉమెన్ పెవిలియన్ కి క్యూ కట్టడంతో ఆ జట్టు కనీసం 50 పరుగుల మార్కు కూడా దాటలేకపోయింది. వెలాసిటీ, ట్రెయిల్ బ్లేజర్స్ మధ్య షార్జాలో మ్యాచ్ లో పరిస్థితి ఇది.

ఈ పోరులో టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే సోఫీ ఎకిల్ స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో వెలాసిటీ 15.1 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే చేసింది ఎకిల్ స్టోన్ 3.1 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. ఎకిల్ స్టోన్ కు తోడు జులాన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ చెరో 2 వికెట్లతో వెలాసిటీ పతనంలో పాలుపంచుకున్నారు. దీప్తి శర్మకు ఓ వికెట్ దక్కింది.

ఓపెనర్ షెఫాలీ వర్మ సాధించిన 13 పరుగులే వెలాసిటీ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు. కెప్టెన్ మిథాలీ రాజ్(1), డానియెల్లే వ్యాట్ (3), సుష్మా వర్మ (1), వేదా కృష్ణమూర్తి (0), సున్ లూస్ (4) తీవ్రంగా నిరాశపరిచారు.

More Telugu News