Kamareddy District: ఇంటిముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి.. విగతజీవిగా స్థానికులకు కనపడ్డ వైనం

  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కలకలం
  • డాగ్‌స్వ్కాడ్‌తో వెతికినా దొరకని వైనం
  • నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో చిన్నారి మృతదేహం 
  • పొలాలవైపు వెళ్తున్న స్థానికుల కంటపడ్డ వైనం
girl dead body found in ellareddy

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారి అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిన్న కలకలం రేపింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చివరకు ఆమె విగతజీవిగా దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో కూతురు సౌమ్య(2) ఇంటిముందు అడుకుంటోంది.

కాసేపటి తర్వాత ఆమె కోసం బయటకు వచ్చిన తల్లికి ఆమె కనపడలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి జాడ తెలియలేదు. దాంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగి డాగ్‌స్వ్కాడ్‌తో వెతికింది. అయినా పాప ఆచూకీ తెలియలేదు.

అయితే, ఈ రోజు ఉదయం పొలాలవైపు వెళ్తున్న స్థానికులు నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి మృతికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

More Telugu News