Uttar Pradesh: నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతకు ఉంది: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

  • మతాంతర వివాహం చేసుకున్న యువతీయువకులు
  • పట్టుకుని బంధించిన యువతి తల్లిదండ్రులు
  • తమను వేరు చేయవద్దంటూ హైకోర్టులో పిటిషన్ 
Allahabad high court sensational verdict

యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్‌లు ప్రేమించుకున్నారు.

 మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరని ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వారిని వెతికి పట్టుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరినీ ఓ గదిలో నిర్బంధించారు. అయితే, వారు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులు ఇద్దరినీ తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని అన్నారు. నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీ యువకులకు ఉందని స్పష్టం చేశారు.

More Telugu News