ఏప్రిల్, జూన్ మధ్య వ్యాక్సిన్ అందుబాటులోకి: భారత్ బయోటెక్
- 30 కేంద్రాల్లో కొవాగ్జిన్ మూడవ విడత ట్రయల్స్
- 14 రాష్ట్రాల్లో జరుగుతాయన్న సాయి ప్రసాద్
- రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల పెట్టుబడి
మూడవ దశ ప్రయోగాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, విజయవంతంగా పూర్తి చేయడంపైనే దృష్టిని సారించామని, బలమైన ప్రయోగాత్మక సాక్ష్యాల ఏర్పాటు, వ్యాక్సిన్ సామర్థ్యం, సమాచార భద్రత తదితరాలే ఈ దశలో కీలకమని అన్నారు. భారత నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే, 2021 రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్ బయటకు వస్తుందని స్పష్టం చేశారు.
ఇక వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కోసం రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నామని స్పష్టం చేసిన ఆయన, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలకు కూడా టీకాను అందిస్తామని తెలిపారు. టీకా ఎగుమతి విషయంలో పలు దేశాల ఫార్మా కంపెనీలతో ప్రస్తుతం ప్రాథమిక చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే, టీకా ఎగుమతి విషయమై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలనూ తమ సంస్థ తీసుకోలేదని సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.