Malaysia: లక్షలాది మందిని చంపే హక్కు ముస్లింలకు ఉందన్న మలేసియా మాజీ ప్రధాని.. ట్విట్టర్ రియాక్షన్!

  • ఫ్రాన్స్ లో ఎందరో ముస్లింలను చంపారన్న మహతిర్
  • తీవ్రంగా ప్రతిస్పందించిన ఫ్రాన్స్ మంత్రి
  • ట్వీట్లు తొలగించాలని ట్విట్టర్ కు హెచ్చరిక
Twitter Deletes Ex Malaysian PMs Tweet For Glorifying Attack In France

మలేసియా మాజీ ప్రధాని మెహతిర్ మెహమ్మద్ ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. హింసను పెంచేలా ట్వీట్ చేసిన ఆయన తమ నిబంధనలను అతిక్రమించారని ట్విట్టర్ ఈ సందర్భంగా తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, ఫ్రాన్స్ లోని నైస్ నగరంలోని చర్చిలో ముగ్గురు వ్యక్తులను ఇస్లామిక్ అతివాదులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. దాడి సందర్భంగా దుండగులు 'అల్లాహూ అక్బర్' అంటూ నినదించారు. అంతకు కొన్ని రోజుల ముందు కూడా ఓ టీచర్ ను అతివాదులు హత్య చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మహతిర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను పిల్లలకు చూపించిన టీచర్ తల నరకడాన్ని తాను సమర్థించనని చెప్పారు. అయితే, ఇతరులను కించపరచడం భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోకి రాదని కూడా అన్నారు. ఆగ్రహంతో ఉన్నవారు మనుషులను చంపుతారని, దానికి మతంతో పనిలేదని చెప్పారు. ఫ్రెంచ్ చరిత్రలో ఎంతో మందిని చంపిన దాఖలాలున్నాయని... హత్యకు గురైనవారిలో అత్యధికులు ముస్లింలని అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో లక్షలాది మందిని చంపే హక్కు ముస్లింలకు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహతిర్ చేసిన ఈ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ మంత్రి సెడ్రిక్ వెంటనే స్పందించారు. ట్విట్టర్ ఫ్రాన్స్ ఎండీతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. మహతీర్ ట్వీట్లను ట్విట్టర్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో, ఆయన ట్వీట్లను ట్విట్టర్ తొలగించింది.

More Telugu News