Hardik Pandya: మైదానంలో మాటలయుద్ధం... పాండ్య, మోరిస్ లకు వార్నింగ్

  • నిన్న ముంబయి, బెంగళూరు మధ్య మ్యాచ్
  • మోరిస్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి వ్యాఖ్యలు చేసిన పాండ్య
  • తర్వాత బంతికి పాండ్య అవుట్
  • ప్రతీకారం తీర్చుకున్న మోరిస్
IPL Organizers reprimanded Hardik Pandya and Chris Morris

నిన్న ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ముంబయి జట్టు 5 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. అయితే ముంబయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు బ్యాట్స్ మన్ హార్దిక్ పాండ్య, బెంగళూరు బౌలర్ క్రిస్ మోరిస్ మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరిగింది.

అసలేం జరిగిందంటే.... లక్ష్యఛేదనలో ముంబయి బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మోరిస్ విసిరిన బంతికి పాండ్య సిక్స్ బాదాడు. ఆ ఊపులో పాండ్య నోటికి పని కల్పించి బౌలర్ మోరిస్ ను కవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే మోరిస్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పాండ్యను అవుట్ చేసిన మోరిస్ తాను కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

ఈ సంఘటనను అంపైర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు పాండ్య, మోరిస్ లను పిలిపించి వివరణ కోరారు. తాము నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇరువురూ అంగీకరించడంతో మందలింపుతో సరిపెట్టారు. వారికి ఎలాంటి జరిమానా విధించలేదు.

More Telugu News