Twitter: లడఖ్ ను చైనా భూభాగంగా చూపించడంపై ట్విట్టర్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!

  • ఓ లైవ్ బ్రాడ్ కాస్ట్ సందర్భంగా ట్విట్టర్ పొరపాటు
  • ట్విట్టర్ ను వివరణ కోరిన పార్లమెంటరీ కమిటీ
  • ట్విట్టర్ జవాబుకు అసహనం వ్యక్తం చేసిన కమిటీ
  • క్షమాపణలు చెప్పిన ట్విట్టర్
Twitter shows Ladakh as China land in a live broadcast

ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ లడఖ్ ను చైనాకు చెందిన భూభాగంగా చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్ వైఖరిని ప్రశ్నిస్తూ నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ధోరణులు ఎక్కువవుతున్నాయంటూ మండిపడుతున్నారు.

అక్టోబరు 19న జరిగిన ఓ లైవ్ బ్రాడ్ కాస్ట్ లో ట్విట్టర్  తప్పిదానికి పాల్పడింది. లడఖ్ ప్రాంతం చైనాలో ఉన్నట్టు చూపించింది. దీనిపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ ట్విట్టర్ ను వివరణ కోరింది. ట్విట్టర్ అధికారులను దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించింది. అయితే ట్విట్టర్ వర్గాలు ఇచ్చిన వివరణ పట్ల పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. లడఖ్ లోని లేహ్ ప్రాంతాన్ని చైనాలో అంతర్భాగంగా చూపడం దేశద్రోహం కిందికి వస్తుందని స్పష్టం చేసింది.

దీనిపట్ల ట్విట్టర్ విచారం వ్యక్తం చేసింది. భారత్ కు చెందిన ఈ అంశం సున్నితమైనదని, తాము పొరపాటు చేసింది నిజమేనని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని తెలిపింది. అంతేకాకుండా, తమ కార్యక్రమంలో ఆ మేరకు పొరబాటును సవరించిన అంశాన్ని కేంద్రానికి నివేదించినట్టు ట్విట్టర్ వెల్లడించింది.

More Telugu News