Bajwa: ఇండియా యుద్ధం చేస్తుందని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ గజగజ వణికిపోయారట!

  • అభినందన్ ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నప్పుడు జరిగిన ఘటన
  • అభినందన్ ను వదలకపోతే భారత్ యుద్ధం చేస్తుందని బజ్వాకు చెప్పిన ఖురేషీ
  • ఆ మాట వినగానే బజ్వాకు ముచ్చెమటలు పట్టాయన్న సాధిక్
Pak army chief was shaking after India threatened to attack says Pak MP

పాకిస్థాన్ పై ఇండియా దాడి చేయబోతోందనే విషయం వినగానే ఆ దేశ సైన్యాధ్యక్షుడు బజ్వా వణికిపోయారట. ఈ విషయాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాధిక్ వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ  ఘటన జరిగింది.

భారత్ పై దాడి చేసేందుకు పాక్ యుద్ధ విమానాలు వచ్చిన వెంటనే మన ఫైటర్ జెట్లు వాటిని వెంబడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయిన అభినందన్ ఒక పాక్ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఇదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోతున్న తరుణంలో ప్యారాచూట్ ద్వారా పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత పాక్ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అభినందన్ ను విడుదల చేయకపోతే భారత్ యుద్ధానికి కూడా సిద్ధమయ్యేది. ఇదే విషయం గురించి అయాజ్ సాధిక్ మాట్లాడారు.

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో సాధిక్ మాట్లాడుతూ, ఇప్పటికీ తనకు జ్ఞాపకం ఉందని... అభినందన్ ను ఆర్మీ అదుపులోకి తీసుకున్న తర్వాత హైలెవెల్ మీటింగ్ జరిగిందని... ఆ  మీటింగ్ కు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాలేదని చెప్పారు. విదేశాంగమంత్రి మహ్మద్ ఖురేషీ మాత్రం హాజరయ్యారని తెలిపారు. 'దయచేసి అభినందన్ ను వదిలిపెట్టండి. లేకపోతే రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేసే అవకాశం ఉంది' అని బజ్వాతో ఖురేషీ చెప్పారని... ఆ మాట వినగానే బజ్వా కాళ్లు గజగజ వణికిపోయాయని చెప్పారు. బజ్వాకు ముచ్చెమటలు పట్టాయని తెలిపారు.

More Telugu News