mumbai: వార్డు నుంచి అదృశ్యమై.. 14 రోజుల తర్వాత ఆసుపత్రి టాయిలెట్‌లో శవమై కనిపించిన యువకుడు!

  • టీబీతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన యువకుడు
  • యువకుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
  • 14 రోజుల పాటు గుర్తించకపోవడంపై పోలీసుల ఆశ్చర్యం

రెండు వారాల క్రితం ఆసుపత్రి వార్డు నుంచి అదృశ్యమైన రోగి తాజాగా ఆసుపత్రి టాయిలెట్‌లో విగతజీవిగా కనిపించాడు. ముంబై, శివాడీలో ఉన్న టీబీ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ఆసుపత్రి సిబ్బంది కథనం ప్రకారం.. టీబీ వ్యాధితో బాధపడుతున్న సూర్యాబన్ యాదవ్ (27) ఇటీవల ఆసుపత్రిలో చేరాడు.

కరోనా లక్షణాలు కూడా అతడిలో కనిపించాయి. ఈ క్రమంలో 14 రోజుల క్రితం అకస్మాత్తుగా ఆసుపత్రి నుంచి మాయమయ్యాడు. అతడి కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 4 పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి గురించి పోలీసులు గాలిస్తుండగానే ఆసుపత్రిలోని టాయిలెట్‌లోనే అతడు శవమై కనిపించాడు.

టాయిలెట్ గది నుంచి దుర్వాసన వస్తుండడంతో గమనించిన సిబ్బంది తలుపులు పగలగొట్టారు. లోపల సూర్యాబన్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్లే అతడు మరణించి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలోనే అతడు మరణించినా ఇన్ని రోజులపాటు గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News