India: విదేశీ వ్యాపార కార్యకలాపాల కోసం.. సరిహద్దులను తెరుస్తున్న భారత్!

  • ఇండియాలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
  • వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఎవరైనా రావచ్చు
  • పర్యాటకులుగా తిరిగేందుకు మాత్రం అనుమతించమన్న హోమ్ శాఖ
India to Reopen International Borders

ఇటీవలి కాలంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండటంతో, నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ సరిహద్దులను తిరిగి తెరవాలని ఇండియా నిర్ణయించింది. విదేశీయులు ఇండియాకు రావచ్చని, అయితే వారు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం రావాలే తప్ప, టూరిస్టులుగా మాత్రం ప్రస్తుతానికి అనుమతించబోమని కేంద్ర హోమ్ శాఖ పేర్కొంది.

వాణిజ్య విమానాలను రెగ్యులర్ షెడ్యూల్ చేసుకోవచ్చని, అయితే, ఎయిర్ బబుల్ అగ్రిమెంట్స్ నిబంధనలను పాటించాలని ఆదేశించిన హోమ్ శాఖ, ప్రైవేటు చార్టర్ విమానాలను కూడా తిప్పుకోవచ్చని, ఓడలను కూడా విదేశీ ప్రయాణాలకు అనుమతిస్తున్నామని, ప్రయాణికులంతా క్వారంటైన్ నిబంధనలు సహా అన్ని కొవిడ్ ప్రొటోకాల్స్ నూ తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

కాగా, గత నెలలో దాదాపు లక్ష వరకూ వెళ్లిన రోజువారీ కొత్త కేసులు, ఇప్పుడు అనూహ్యంగా పడిపోయాయి. ప్రస్తుతం సగటున రోజుకు 50 వేలకు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు తగ్గుతున్నందునే కేంద్రం అంతర్జాతీయ సరిహద్దులను తెరవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇక ఇప్పటికే అనుమతించిన వీసాలను (టూరిస్ట్, మెడికల్, ఎలక్ట్రానిక్ వీసాలు మినహా) తక్షణం రీస్టోర్ చేస్తున్నామని తెలిపిన హోమ్ శాఖ, వీసాల కాలపరిమితి ముగిసిపోయిన వారు, తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. వ్యాపారాలు, కాన్ఫరెన్స్ లు, వర్క్, స్టడీ, రీసెర్చ్ తదితరాల కోసం వచ్చేవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.

More Telugu News