Raghu Rama Krishna Raju: ఎవరైనా వచ్చి జగన్ హృదయంలో తీగను కదిలించి అనురాగం పండించాలి: రఘురామకృష్ణరాజు

  • ఢిల్లీలో రఘురామ రచ్చబండ
  • యథావిధిగా జగన్ పై వ్యాఖ్యలు
  • సినీ హిట్ గీతాన్ని ఉదాహరించిన వైనం
Raghurama Krishna Raju mentions a popular song

తన కేరాఫ్ అడ్రస్ ను ఢిల్లీకి మార్చుకున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ పై మరోసారి స్పందించారు. రచ్చబండ పేరిట నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న రఘురామకృష్ణరాజు నేడు కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిరోజూ పాటలు వింటుంటానని, ఇవాళ ఉదయం అనుకోకుండా ఓ పాట వినడం జరిగిందని చెప్పారు. "ఎవరో రావాలి, నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి" అనే ఆ పాట వినగానే తనకు ఓ విషయం స్ఫురించిందని తెలిపారు.

'ప్రేమనగర్' సినిమాలో నాగేశ్వరరావును మార్చడానికి వాణిశ్రీ ఈ పాట పాడుతుందని వివరించారు. ఆ విధంగానే ఎవరైనా వచ్చి మన ముఖ్యమంత్రి తీగను కూడా కదిలించాలని అన్నారు. ఆ తీగను కదిలించి ఆయన హృదయంలో అనురాగం పండిస్తే ఏదైనా మంచి జరుగుతుందేమోనని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. మంచి జరిగితే స్వాగతిద్దాం... లేకపోతే మన మంచి మనమే చేసుకుందాం అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News