Nayini Narsimha Reddy: నాయినికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు: కేటీఆర్

  • ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో అపోలోలో చికిత్స పొందుతున్న నాయిని
  • ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కేటీఆర్
  • కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైనం
KTR went to appolo to meet Nayini

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమధ్య కరోనా బారిన పడిన నాయిని పూర్తిగా కోలుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆయన మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, మంత్రి కేటీఆర్ ఈరోజు అపోలో ఆసుపత్రికి వెళ్లి నాయినిని పరామర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, నాయినికి అత్యవసర చికిత్స అందిస్తున్నారని, ఆయన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.

More Telugu News