KXIP: ముంబై వర్సెస్ పంజాబ్.. సూపర్ ఓవర్‌లో పంజాబ్‌ విజయం!

  • ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిన నిన్నటి మ్యాచ్‌లు
  • ముంబై-పంజాబ్ మ్యాచ్‌లో రెండుసార్లు సూపర్ ఓవర్లు
  • సూపర్ ఓవర్‌లో పంజాబ్‌ను గెలిపించిన గేల్, అగర్వాల్
Punjab won the match against Mumbai in second super over

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన క్రికెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు. ఓటమి అంచుల్లోకి వచ్చిన మరో జట్టు అనూహ్యంగా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అందుకే క్రికెట్‌లో ముందస్తు అంచనాలు కొన్నిసార్లు పనిచేయవు. ఇక, ఐపీఎల్ లాంటి టీ20ల్లో అయితే ఈ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐపీఎల్ 2020)లో ఈ మలుపులు మరింత ఎక్కువ ఉంటాయి.

నిజానికి ప్రస్తుత ఐపీఎల్‌లో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌లను వేళ్ల మీద లెక్కించొచ్చు. అయితే, నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను చివరి బంతి వరకు ఉత్కంఠకు గురిచేశాయి. అంతేకాదు, రెండు మ్యాచ్‌లు టై కాగా, సూపర్ ఓవర్‌కు దారితీశాయి. ముంబై-పంజాబ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లోనూ టై కావడంతో మరో సూపర్ ఆడాల్సి వచ్చింది. ఒకే రోజు మూడు సూపర్ ఓవర్లు జరిగాయన్న మాట. ఈ సూపర్ ఓవర్లలో తొలుత కోల్‌కతా విజయం సాధించగా, ఆ తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్ 53 (43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కృనాల్ పాండ్యా 34(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్), పొలార్డ్ 34(12 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లు), కౌల్టర్ నైల్ 24 (12 బంతుల్లో 4 ఫోర్లు) పరుగులు చేయడంతో ముంబై 176 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం 177 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 77 (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ గేల్ 24 (21 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు), పూరన్ 24 (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా 23 (16 బంతుల్లో ఫోర్, సిక్సర్), క్రిస్ జోర్డాన్ 13 (8 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు చేశారు.

మ్యాచ్ టై కావడంతో ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేసింది. దీంతో అద్భుతమైన బ్యాట్స్‌మెన్ కలిగిన ముంబైదే విజయమని భావించారు. అయితే, షమీ అద్భుత బౌలింగుతో ముంబై పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో తొలి 5 బంతుల్లో 4 పరుగులు రాగా, చివరి బంతికి ఒక పరుగు తీసి, రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో డికాక్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మరోమారు టై అయింది.  ఫలితంగా విజేతను తేల్చేందుకు మరో సూపర్ ఓవర్ అనివార్యమైంది.

ఈసారి ముంబై పొలార్డ్, పాండ్యాలను బరిలోకి దింపింది. అయితే, జోర్డాన్ కట్టుదిట్టమైన బౌలింగు ముందు పరుగులు చేయలేకపోయారు. తొలి రెండు బంతులకు మూడు పరుగులు రాగా, మూడో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించాడు. నాలుగో బంతి వైడ్ కాగా,  ఆ తర్వాతి బంతికి పాండ్యా రనౌట్ అయ్యాడు. ఐదో బంతి డాట్ బాల్. చివరి బంతికి పొలార్డ్ రెండు పరుగులు చేయడంతో ముంబై వికెట్ నష్టానికి 11 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం 12 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. విధ్వంసకర ఆటగాడు గేల్‌, అగర్వాల్‌ క్రీజులోకి వచ్చారు. బౌల్ట్ వేసిన తొలి బంతినే గేల్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికి సింగిల్ రాగా, మూడో బంతిని అగర్వాల్ బౌండరీకి పంపాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా, నాలుగో బంతిని అగర్వాల్ బౌండరీకి తరలించడంతో మ్యాచ్ పంజాబ్ వశమైంది.

More Telugu News