Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వర్ష సూచన... రాగల నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు

Disaster management department issues heavy rain alert for AP
  • పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • కోస్తా, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ
ఇటీవలే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరద పరిస్థితుల నుంచి ఇప్పటికీ అనేక జిల్లాలు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల నాలుగైదు గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఓ ప్రకటన చేశారు.

కాగా, ఇప్పటికే విజయవాడ, కర్నూలు నగరాల్లో భారీ వర్షం కురిసింది. కర్నూలు ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారి పూర్తిగా జలమయమైంది. ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు సాగించాలని నగర డీసీపీ విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
Heavy Rains
Trough
Bay Of Bengal

More Telugu News