Kanakamedala Ravindra Kumar: కేసుల నుంచి బయటపడేందుకు జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారు: కనకమేడల

  • సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేతల విమర్శలు
  • వ్యక్తిగత అజెండాతోనే జగన్ ఢిల్లీ వెళ్లారన్న కనకమేడల
  • ఏడాదిన్నరగా ఏంచేశారంటూ ప్రశ్న 
Kanakamedala Ravindra Kumar comments on CM Jagan Delhi tour

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. వ్యక్తిగత అజెండాతోనే జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగిందని ఆయన ఆరోపించారు. ప్రధాని, హోంమంత్రితో సమావేశాల్లో జగన్ తన భవిష్యత్ గురించే మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.

కోర్టు విచారణలు, కేసుల నుంచి బయటపడేందుకు జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన ఢిల్లీ సమావేశాల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారని కనకమేడల వ్యాఖ్యానించారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ మడమతిప్పేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాను పణంగా పెట్టి జగన్ సొంత కేసుల కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది, ఇప్పటివరకు రాష్ట్రం కోసం ఒక నిరసన గానీ, ఒక డిమాండ్ గానీ చేశారా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ తమను కేసుల నుంచి బయటపడేయాలని, రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ విచారణ జరగాలని మాత్రమే జగన్ కోరుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిని వ్యతిరేకించడం ద్వారా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టంలేదని ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలను జగన్ మర్చిపోయారా..? అని కనకమేడల నిలదీశారు.

More Telugu News