Apex Council: ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం... బలమైన వాదనలు వినిపించిన ఏపీ, తెలంగాణ

Apex council meeting held in Delhi
  • ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ భేటీ
  • కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన భేటీ
  • హాజరైన కేసీఆర్, జగన్
ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న జలవివాదాలతో పాటు ఇటీవల తలెత్తిన నీటి కేటాయింపుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీ 2 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ బలమైన వాదనలు వినిపించాయి.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిబంధనలను పాటిస్తూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని ఏపీ స్పష్టం చేసింది. తాము వాడుకుంటున్నది మిగులుజలాలను మాత్రమేనని, ఇందులో తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ తన వాదనలు వినిపించింది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు కృష్ణా నదీ జలాలపైనే తమ వాదనలు వినిపించాయి. ఈ సమావేశంలో నాలుగు ప్రధాన అంశాలను చర్చించాలని అజెండా రూపొందించినప్పటికీ, ఆ నాలుగు అంశాల అనుబంధ అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చినట్టు తెలిసింది.

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తమకు అప్పగించాలని తెలంగాణ కోరగా, ఆ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని ఏపీ  సూచించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న సీఎం జగన్ జన్ పథ్-1 అధికారిక నివాసం నుంచి వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.
Apex Council
New Delhi
Telangana
Andhra Pradesh
Jagan
KCR
Krishna River

More Telugu News