Bihar: విచిత్రంగా మారిన బీహార్ రాజకీయం... ఎన్డీయేలో ఉంటూనే నితీశ్ కు వ్యతిరేకమైన చిరాగ్ పాశ్వాన్!

  • బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
  • జేడీయూకు మాత్రమే వ్యతిరేకం
  • బీజేపీ స్థానాల్లో అభ్యర్థులను నిలుపబోము
  • ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్
LJP To Contest in All JDU Seats in Bihar

లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్, ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే, తన స్వరాష్ట్రమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి నితీశ్ కుమార్ కు వ్యతిరేకమైపోగా, ఒక్కసారిగా బీహార్ రాజకీయం మారిపోయింది. ఆదివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్, బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నామని, జనతా దళ్ (యునైటెడ్)తో తమకు ఎటువంటి పొత్తూ ఉండబోదని స్పష్టం చేశారు.

ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, "ఈ సందర్భాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. రానున్న ఎన్నికలపై ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ చెప్పలేను" అని అన్నారు. తమ పార్టీ జేడీయూతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయని పార్టీ జాతీయ కార్యదర్శి అబ్దుల్ ఖలీఖ్ వ్యాఖ్యానించారు. తమకు జేడీయూతో సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయే తప్ప, బీజేపీతో లేవని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

కాగా, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అభ్యర్థులు ఉన్న అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతుందని, బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట్ల మాత్రం పోటీకి దిగబోమని ఎల్జేపీ అధినేత స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ నిర్ణయం శనివారం నాడే వెల్లడించాల్సి వుందని, అయితే, చిరాగ్ పాశ్వాన్ తండ్రి, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు ఢిల్లీలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతూ ఉండటంతో పార్టీ సమావేశం ఒక రోజు ఆలస్యం అయిందని తెలుస్తోంది.

ఇదిలావుండగా, నిన్న పార్టీ ట్విట్టర్ ఖాతాలో చిరాగ్ "బీహార్ ఫస్ట్... బీహారీ ఫస్ట్" పేరిట తన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీని ప్రేరణగా తీసుకుని రూపొందించామని, ఈ ఎన్నికల్లో విజయం సాధించే తమ పార్టీ అభ్యర్థులంతా భవిష్యత్తులో మోదీకి బలమవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News