Murder: స్నేహితుడ్ని లారీతో తొక్కించిన వ్యక్తి... వివాహేతర సంబంధమే కారణమా?

  • భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మిత్రుడిపై అనుమానం
  • మిత్రుడ్ని లారీలో గుజరాత్ తీసుకెళ్లిన వైనం
  • మద్యం తాగించి రోడ్డుపై పడేసిన వ్యక్తి 
Lorry driver killed friend with his vehicle

కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన మూల్పూరి రాంగోపాల్, తోట నాగేంద్రబాబు స్నేహితులు. వీరిలో నాగేంద్రబాబు ఓ లారీ డ్రైవర్. అయితే, రాంగోపాల్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం నాగేంద్రబాబులో పురివిప్పింది. దాంతో రాంగోపాల్ ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని పక్కా ప్లాన్ వేశాడు.

ఇక, హైదరాబాద్ వెళుతున్నానంటూ రాంగోపాల్ ఆగస్టు చివరి వారంలో ఇంటినుంచి బయల్దేరాడు. సెప్టెంబరు 5 నుంచి అతడి ఫోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి మొబైల్ ఫోన్ ను ట్రాక్ చేయడంతో బొబ్బిలి టవర్ పరిధిలో ఉన్నట్టు తెలిసింది.

రాంగోపాల్ లారీ డ్రైవర్ నాగేంద్రబాబుతో సన్నిహితంగా ఉంటాడని తెలుసుకున్న పోలీసులు, నాగేంద్రబాబును అరెస్ట్ చేస్తే అసలు దారుణం వెల్లడైంది. అసలేం జరిగిందంటే... హైదరాబాద్ వెళుతున్నానని ఇంట్లో చెప్పిన రాంగోపాల్ వాస్తవానికి తన ఫ్రెండ్ నాగేంద్రబాబుతో కలిసి లారీలో గుజరాత్ వెళ్లాడు. అక్కడి నుంచి సెప్టెంబరు 5న మార్బుల్ లోడుతో బొబ్బిలి వచ్చారు.

అన్ లోడ్ చేసి కంచికచర్ల వచ్చే క్రమంలో పారిశ్రామిక వాడ వద్ద లారీ నిలిపిన నాగేంద్ర బాబు... రాంగోపాల్ కు బాగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న రాంగోపాల్ ను రోడ్డుపై పడేసి తన లారీతో నిర్దాక్షిణ్యంగా తొక్కించి చంపేశాడు. ఆ సమయంలో క్లీనర్ శివ లారీలో నిద్రపోతున్నాడు. కాసేపటి తర్వాత శివ మేల్కొని రాంగోపాల్ గురించి ప్రశ్నించగా, విశాఖలోని బంధువుల ఇంటికి వేరే వాహనంలో వెళ్లిపోయాడని నాగేంద్రబాబు అతడితో చెప్పాడు. ఆ విధంగా స్నేహితుడ్ని కడతేర్చాడు.

More Telugu News