Witch Craft: వీడియో కాలింగ్ లో మంత్రాలు, శ్మశానంలో పూజలు.. యువకులను చితకబాదిన గ్రామస్తులు

  • హుజూర్ నగర్ మండలంలో ఘటన
  • చేతబడిగా అనుమానించిన గ్రామస్తులు
  • యువకులను మందలించి పంపించేసిన ఎస్సై
Youth performs witch craft in grave yard

నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలంలోని గోవిందాపురంలో చేతబడి అనుమానంతో కొందరు యువకులను స్థానికులు చితకబాదారు. శ్రీకాంత్, రవి, రాము, వెంకటేశ్వర్లు అనే నలుగురు యువకులు గురువారం రాత్రి శ్మశానంలో క్షుద్రపూజలు నిర్వహించారు. ఖమ్మం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన భూతవైద్యులు వీడియో కాలింగ్ ద్వారా మంత్రాలు చదువుతుండగా, వారు అవే మంత్రాలను పఠిస్తూ పూజలు చేశారు.

ఇది గమనించిన స్థానికులు వారిపై దాడికి దిగారు. దాంతో ఆ నలుగురిలో ఓ యువకుడు పారిపోయాడు. అయితే మరునాడు ఉదయం గ్రామపెద్దలు ఆ యువకులను పిలిపించి ప్రశ్నించగా, ఒకదానికొకటి సంబంధంలేని సమాధానాలు చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహించి వారిని చితకబాదారు.

వారిని శ్మశానానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించిన స్థలంలో సోదాలు చేయగా, మట్టిలో పూడ్చిన ఇద్దరు మహిళల పాస్ పోర్టు సైజు ఫొటోలు, ఓ చీరె, జాకెట్, నిమ్మకాయలు, వెంట్రుకలు, రెండు నల్ల కోళ్లు, పిండితో చేసిన బొమ్మ, కొబ్బరికాయలు కనిపించాయి. దాంతో ఆ యువకులు క్షుద్రపూజలు చేస్తున్నారని భావించి వారిని పోలీసులకు అప్పగించారు.

ఆ యువకులు చెప్పింది విన్న ఎస్సై వారిని మందలించి పంపించేశారు. ఆ మహిళల ఫొటోలు తమ కుటుంబంలోని వారివేనని, తమ కుటుంబంలో సమస్యలు ఉండడంతో ఒంగోలుకు చెందిన ఓ పూజారి చెప్పినట్టుగా పూజలు చేస్తున్నామని ఆ యువకులు మీడియాకు తెలిపారు. తాము చేతబడి చేస్తున్నామని గ్రామస్తులు పొరబడ్డారని, తమను కొట్టారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News