Budda Venkanna: ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం 420: బుద్ధా వ్యాఖ్యలు

  • చంద్రబాబుపై ధర్మాన నోటికొచ్చినట్టు మాట్లాడారన్న బుద్ధా
  • ధర్మాన మతిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • చంద్రబాబును ఎవరూ అనని మాటలన్నారంటూ మండిపాటు
Budda Venkanna slams YCP Minister Dharmana Krishnadas

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. చంద్రబాబును నోటికొచ్చినట్టుగా మాట్లాడిన ధర్మాన శ్రీకాకుళం 420 అని ఎద్దేవా చేశారు. ఒకరిని వేలెత్తి చూపితే మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే చూపుతాయన్న విషయం ధర్మాన గుర్తించాలని అన్నారు. చంద్రబాబును ఎవరూ అనని మాటలు అన్నారంటూ మండిపడ్డారు.

మంత్రి పదవిని కాపాడుకునేందుకు ధర్మాన మతిలేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును బాగా తిడితే సాక్షి మీడియాలో చూపిస్తారని మంత్రులు ఇష్టానుసారం దుర్భాషలాడుతున్నారని అన్నారు. తాము గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నందువల్లే ఈ ఎన్నికల్లో 23 సీట్లు మిగిలాయని వైసీపీ నేతలు అంటున్నారని, మరి తమ ఎమ్మెల్యేలను ఐదుగుర్ని తీసుకున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఐదు సీట్లే ఖాయం అని బుద్ధా వ్యాఖ్యానించారు. పురోహితుల నోటి వెంట నీతులు, పనికిమాలిన మంత్రుల నోట్లోంచి బూతులు ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు.

More Telugu News