Kanakadurga Flyover: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం ఈ నెల 16న: కేశినేని నాని

  • ఇప్పటికి రెండుసార్లు వాయిదాపడిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
  • మరోసారి ముహూర్తం ఖరారు
  • కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారన్న కేశినేని నాని
Kesineni Nani tells Kanakadurga flyover will be inaugurated shortly

బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మరోసారి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కనకదుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ భారీ ఫ్లైఓవర్ కొంతకాలం కిందటే నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికి రెండుసార్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది.

తొలుత సెప్టెంబరు 4న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆపై సెప్టెంబరు 18న మరో ముహూర్తం నిర్ణయించినా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో అది కూడా వాయిదా వేశారు.  

ఈ నేపథ్యంలోనే తాజా ముహూర్తం ఖరారు చేశారు. కాగా, అధికారిక ప్రారంభోత్సవం జరుపకపోయినా, ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ పై రాకపోకలను ఇప్పటికే అనుమతించారు.

More Telugu News