Sanchaita: అశోక్ గజపతి రాజు ఇంత దిగజారుతారనుకోలేదు: సంచయిత తీవ్ర విమర్శలు

  • మహారాజా కాలేజీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • ఈ కాలేజీ ఎప్పటికీ ప్రైవేట్ కాలేజీనే
  • 2017లో ఎయిడెడ్ హోదాను ఆయనే సరెండర్ చేశారు
Ashok Gajapathi became like false news spreader says Sanchaita

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ గా సంచయిత బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచీ ఆమెకు, అశోగ్ గజపతిరాజుకు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల దీనిపై అశోక్ గజపతిరాజు చేసిన విమర్శలకు సంచయిత తాజాగా స్పందించారు.

'అశోక్ గజపతిరాజు గారు మహారాజా కాలేజీపై వాట్సాప్ లో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చూసి షాక్ కు గురయ్యాను. ఆయన ఇంత దిగజారుతారని అనుకోలేదు. ఎంఆర్ కాలేజీ ఒక ప్రైవేట్ అటానమస్ కాలేజ్ అనే విషయాన్ని అశోక్ గారు మర్చిపోయినట్టున్నారు. ఇప్పటికీ అది ప్రైవేట్ కాలేజీనే. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది.

కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఎయిడెడ్‌ హోదాను 2017లో ఆయనే సరెండర్‌ చేశారు. అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోంది. ఇందులో ప్రభుత్వ జోక్యంకాని, సంబంధం కాని లేదు. ఈ విషయాన్ని ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు.

 దయచేసి మీ రాజకీయాల్లోకి మాన్సాస్‌ విద్యాసంస్థలను లాగవద్దు. అశోక్‌గారు మాన్సాస్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తప్పుడు వివరాలు ఇవ్వటం మూలాన మాన్సాస్‌ కాలేజీలకు రూ.6.5 కోట్ల నష్టం వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్‌గారు డిస్కౌంట్‌గా ఈ డబ్బు ఇచ్చారేమో? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఈ డబ్బును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

సరైన అనుమతులు లేని కారణంగా 2018–2020లో 170 మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయి. అశోక్ గారి హయాంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. వారి జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. నేను వచ్చాక ఈ సమస్యపై దృష్టిపెట్టాను. అశోక్‌గారు తన రాజకీయ ఆటలకోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. అశోక్ గారూ కనీసం గాంధీ జయంతి రోజునైనా మీరు నిజం మాట్లాడాలి..'' అంటూ సంచయిత పేర్కొన్నారు.

More Telugu News