Avanthi: తండ్రి నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన అవంతి

  • ఇటీవల హేమంత్ అనే యువకుడి హత్య
  • పరువు హత్య అని భావిస్తున్న పోలీసులు
  • అత్తమామల ఇంటి వద్ద రెక్కీ జరుగుతోందన్న హేమంత్ భార్య
Avanthi seeks police security after her husband Hemant killed

ఇటీవల హైదరాబాదులో హేమంత్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి పరువు హత్యకు గురికావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హేమంత్ భార్య అవంతి తన తండ్రి లక్ష్మారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, హేమంత్ తల్లిదండ్రులను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, తన అత్తమామల నివాసం వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అవంతి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు తమకు రక్షణ కల్పించాలంటూ ఆమె గచ్చిబౌలి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

గచ్చిబౌలిలో హేమంత్ తో కలిసి ఉన్న  ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకువచ్చేందుకు వెళితే, తనను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అనుసరించారని అవంతి తెలిపారు. తన మరిదిని కూడా ఇదే విధంగా అనుసరిస్తున్నారని ఆమె వెల్లడించారు. కాగా, అవంతి తన అత్తమామలతో కలిసి సీపీ సజ్జనార్ ను కలిసి తమకు భద్రత కల్పించాలని కోరనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే అవంతి, హేమంత్ ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోగా, పరువు పోయిందన్న కారణంగా అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, ఆమె మేనమామ యుగంధర్ స్థానికంగా ఉండే క్రిమినల్ గ్యాంగ్ తో కలిసి పక్కా ప్లాన్ తో హేమంత్ ను హతమార్చారు. ఈ ఘటనలో పోలీసులు 22 మందిని నిందితులుగా గుర్తించారు.

More Telugu News