sunita: బాలూని గుర్తు చేసుకుంటూ సింగర్‌ సునీత భావోద్వేగభరిత వ్యాఖ్యలు

  • ఏదో జన్మలో అదృష్టం చేసుకున్నాను
  • అందుకే బాలుతో ఈ జన్మలో పరిచయం
  • పుట్టేటప్పుడే అందరూ మహా రుషులుగా పుట్టరు
  • బాలు నాకు ఎన్నో విషయాలు చెప్పారు
sunita about balu

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై గాయని సునీత మరోసారి స్పందిస్తూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో రూపంలో ఆమె మాట్లాడుతూ... తన గురువు బాలు మృతితో అంతా శూన్యంలా మారిందని చెప్పారు. తాను ఏదో జన్మలో అదృష్టం చేసుకోవడం వల్లే ఆయనతో ఈ జన్మలో పరిచయం ఏర్పడిందని ఆమె చెప్పారు.

ఆయనతో కలిసి తనకు పాటలు పాడే అవకాశం దక్కిందన్నారు.  పుట్టేటప్పుడే అందరూ మహా రుషులుగా పుట్టరని, ఎదిగే క్రమంలో వాళ్లు నేర్చుకున్న పాఠాలు, అనుభవాలే వారికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని అందిస్తాయని ఆమె చెప్పింది. బాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని, ఎన్నో అనుభవాలు ఆయనకు ఎదురయ్యాయని చెప్పారు.

ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తని తెలిపారు. తాను పాడే పాటని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారని చెప్పారు. పనిపట్ల ఆయనకున్న నిబద్ధతే ఆయనను గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దిందని అన్నారు. ఆయన లేరని దయచేసి ఎవరూ అనవద్దని, ఆయన ఎప్పటికీ ఉంటారని తెలిపారు. కొంతమంది కారణజన్ములని, ఒక పని కోసం భూమిపైకి వస్తారని ఆమె చెప్పారు. ఇకపై బాలు కొత్త పాటలు వినబోమని, అయితే, ఆయన పాడిన పాత పాటల్నే మనం వింటుంటామని, అవన్నీ వినాలంటే మనకు జీవితకాలం సరిపోదని అన్నారు.

జీవితం ఎప్పుడూ పూలబాట కాదని, అది ఒక ముళ్లబాట అని, చూసుకుంటూ అడుగులేయాలని సింగర్ సునీత తెలిపారు. మనం వెళ్తున్న దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయని ఆమె చెప్పారు. నవ్వుతూ క్రమశిక్షణతో ముందుకు అడుగులు వేయాలని ఆమె అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విధంగా వ్యవహరించాలని అన్నారు. బాలు తనకు ఈ మాటలు చెప్పారని, ఆయన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపారు.           

More Telugu News