TATA: టాటా గ్రూప్ నుంచి బయటకు వచ్చేందుకు ఇదే సరైన సమయం: మిస్త్రీ కుటుంబం

  • టాటా సన్స్ లో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఉన్న మిస్త్రీ ఫ్యామిలీ
  • 18 శాతం వాటాలను విక్రయించాలని ఆలోచన
  • నిధుల కొరతలో ఉన్న ఎస్పీ గ్రూప్
Mistry Family to Sell Share in TATA Sons

బిలియనీర్ మిస్త్రీ ఫ్యామిలీ టాటా గ్రూప్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టాటాగ్రూప్ లో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్ గా ఉన్న మిస్త్రీ కుటుంబం, తమకున్న మొత్తం వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, మిస్త్రీ కుటుంబం వద్ద ప్రస్తుతం 18 శాతం మేరకు టాటా గ్రూప్ లో వాటాలు ఉన్నాయి. ఇటీవల మిస్త్రీ కుటుంబం వద్ద ఉన్న 18 శాతం వాటాలను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

కాగా, షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ కు కూడా ఇప్పుడు నిధుల కొరత ఉంది. దీంతో టాటా గ్రూప్ ఇస్తున్న ఆఫర్ ను తీసుకునేందుకు ఇదే సరైన సమయమని మిస్త్రీ ఫ్యామిలీ భావిస్తోంది. షాపూర్ జీ పల్లోంజీ మిస్త్రీ కుటుంబ నిర్వహణలో ఉన్న కంపెనీలు రుణాలను తిరిగి చెల్లించాల్సిన సమయం దగ్గర పడిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, ఆస్తుల తనఖా తదితర ఆప్షన్స్ ఎస్పీ గ్రూప్ ముందు ఉన్నప్పటికీ, రిస్క్ తీసుకునే బదులు టాటా గ్రూప్ నుంచి బయటకు రావడమే సరైన నిర్ణయమని కుటుంబ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం అతి త్వరలోనే వెల్లడిస్తామని మిస్త్రీ ఫ్యామిలీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఎస్పీ, టాటా గ్రూపులది 70 ఏళ్ల వ్యాపార అనుబంధం.

More Telugu News