Harsha Kumar: చీరాల యువకుడు కిరణ్ మృతి కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో హర్షకుమార్ పిటిషన్

Former MP Harsha Kumar files petition on Kiran Kumar death case
  • ఇటీవల చీరాలకు చెందిన కిరణ్ కుమార్ మృతి
  • పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడంటున్న కుటుంబ సభ్యులు
  • ఎస్సైను సస్పెండ్ చేసిన పోలీసు శాఖ
  • దర్యాప్తును స్థానిక నేతలు ప్రభావితం చేస్తున్నారన్న హర్షకుమార్
ఇటీవల చీరాలలో కిరణ్ కుమార్ అనే యువకుడు పోలీసు దెబ్బల కారణంగా మృతి చెందాడంటూ స్థానిక ఎస్సైపై తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. అనంతరం టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆ ఎస్సైను సస్పెండ్ కూయడ చేశారు.

అయితే, ఈ కేసు దర్యాప్తును స్థానిక నేతలు ప్రభావితం చేస్తున్నారంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన చీరాల యువకుడు కిరణ్ కుమార్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర సర్కారుకు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇటీవల చీరాలలో స్నేహితుడితో కలిసి వెళుతున్న కిరణ్ కుమార్ ను పోలీసులు మాస్కు ఏదని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. పోలీసులతో కిరణ్ కుమార్, అతని స్నేహితుడు వాగ్యుద్ధానికి దిగడంతో వారిని ఎస్సై విజయ్ కుమార్ పోలీసు జీపులో తరలించారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ పై ఎస్సై విజయ్ కుమార్ దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గాయాలపాలైన కిరణ్ కుమార్ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

More Telugu News

Harsha Kumar
CBI
AP High Court
Kiran Kumar
Death
Chirala