batti vikramarka: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై తప్పుడు లెక్కలు: కాంగ్రెస్ నేత భట్టి

  • ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉంది
  • నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెప్పింది
  • ఒక్క ఇల్లు కూడా కట్టలేదు
  • ఇంకెప్పుడు 2.4లక్షల ఇళ్లు కడతారు  
batti fires on trs govt

హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేస్తున్నామంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసత్య వ్యాఖ్యలు చేస్తోందని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క మండిపడుతోన్న విషయం తెలిసిందే. దీంతో అధికారులతో కలిసి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల   భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి ఆయనను తీసుకుని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చూపించారు. దీనిపై భట్టి విక్రమార్క ఈ రోజు మళ్లీ స్పందించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందని హైదరాబాద్‌లోని నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెప్పిందని, అయితే, ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. అలాగే, జూబ్లీహిల్స్‌లోని రెండు ప్రాంతాల్లో 226 ఇళ్లు కట్టినట్టు సర్కారు చెప్పిందని, అందులోనూ ఎన్నో అవకతవకలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతి అర్బన్‌ నియోజకవర్గానికి 10 వేల చొప్పున  ఇళ్లు నిర్మిస్తామని 2016లోనే సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకెప్పుడు 2.4లక్షల ఇళ్లు కడుతుందని ఆయన నిలదీశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే లక్ష ఇళ్లు కట్టామని తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News