మోదీజీ, ఎందుకంతగా భయపడుతున్నారు?: రాహుల్ గాంధీ
- కేంద్రమంత్రులు, ప్రధాని పరస్పర విరుద్ధ ప్రకటనలు
- అన్నింటినీ గుర్తు చేస్తూ రాహుల్ తీవ్ర విమర్శలు
- విదేశాల నుంచి ట్విట్టర్ ద్వారా ప్రశ్నాస్త్రాలు
వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన తల్లి సోనియాగాంధీ వెంట ఉన్న రాహుల్ పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. రాజ్యసభలో నిన్న ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ గత ఆరు నెలల కాలంలో భారత్, చైనా సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు జరగలేదని స్పష్టం చేశారు.
అంతకుముందు రోజు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వాస్తవాధీనరేఖ వద్ద యథాతథస్థితిని మార్చే చైనా కుట్రను భారత్ అడ్డుకుంటుందని, లడఖ్ ప్రాంతంలో మన దేశం కఠిన సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. జూన్లో ప్రధాని మాట్లాడుతూ భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని, ఏ పోస్టును ఆక్రమించలేదని పేర్కొన్నారు.
కాగా, అదే నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి భారత్ 750 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తాజాగా ట్వీట్ చేశారు.