Sandalwood: ఐటీ భయంతో ఇల్లు అమ్మకానికి పెట్టిన శాండల్‌వుడ్ నటి రాగిణి

  • డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న రాగిణి
  • ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేస్తుందన్న భయం
  • కొనడానికి ఎవరూ ముందుకు రాని వైనం
Sandalwood actress Ragini Dwivedi ready to sell her assets

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి రాగిణి ద్వివేది ఇప్పుడు ఐటీశాఖను చూసి విపరీతంగా భయపడుతున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఐటీ దాడులు, జప్తుల భయంతో తన ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు ఆ కథనాలను బట్టి తెలుస్తోంది. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న యలహంకలోని అపార్ట్‌మెంట్‌ను కూడా విక్రయానికి ఉంచినట్టు చెబుతున్నారు. అయితే, దానిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఆమె ఆస్తులను కొనుగోలు చేసి చిక్కుల్లో పడడం ఎందుకున్న భావనతోనే ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం.

కాగా, రాగిణి బీజేపీలో చేరబోతున్నట్టు కూడా పుకార్లు గుప్పుమన్నాయి. షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన ఆమె అక్కడ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్‌రావుతో భేటీ అయ్యారు. తాను పదవుల కోసం పార్టీలో చేరడం లేదని, సామాన్య కార్యకర్తగానే ఉంటానని ఈ సందర్భంగా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో ఆమె చేరికకు లైన్ క్లియర్ అయిన సమయంలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అరెస్ట్ కావడంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసినట్టు చెబుతున్నారు.

More Telugu News