Ragini Dwivedi: తన ఆరోగ్యం బాగాలేదన్న రాగిణి ద్వివేది... జైల్లో ఆసుపత్రి ఉందన్న కోర్టు

  • రాగిణి ద్వివేది, సంజనాలను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
  • రాగిణికి మరో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
  • సంజనాకు మూడ్రోజుల కస్టడీ
Court extends judicial custody to Ragini Dwivedi in drugs scam

కర్ణాటక చిత్ర పరిశ్రమను డ్రగ్స్ స్కాం కుదిపేస్తోంది. ఏకంగా ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్ కావడంతో ఇండస్ట్రీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. విచారణ ముందుకు సాగేకొద్దీ ఇంకెన్ని పేర్లు బయటికి వస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. కాగా, ఈ డ్రగ్స్ కుంభకోణంలో అరెస్ట్ అయిన రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

అయితే, తన ఆరోగ్యం దెబ్బతిన్నదని, బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాగిణి ద్వివేది స్పెషల్ కోర్టుకు విన్నవించుకుంది. అయితే కోర్టు ఆమె విన్నపాన్ని తోసిపుచ్చింది. పరప్పన అగ్రహారం జైల్లో ఆసుపత్రి కూడా ఉందని, మీరు అక్కడ చికిత్స చేయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆపై ఆమెకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది.

ఇక, సంజనా గల్రానీని ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంజనాకు మూడు రోజుల కస్టడీ విధిస్తున్నట్టు తెలిపింది.

అంతకుముందు, వాదనల సందర్భంగా... సంజనాను 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోరారు. కానీ కోర్టు అంగీకరించలేదు. ఇప్పటికే సంజనాను ఏడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈసారి ఆమె ఫోన్ డేటా ఆధారంగా విచారించనున్నారు.

More Telugu News