South Africa: తీవ్ర సంక్షోభంలో దక్షిణాఫ్రికా క్రికెట్.. ఒలింపిక్ బాడీ చేతిలోకి క్రికెట్ బోర్డు

  • సీఎస్‌ఏను తమ నియంత్రణలోకి తీసుకున్న ఒలింపిక్ కమిటీ
  • ఇప్పటికే అవినీతి, జాతి వివక్ష ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి
  • ఎస్ఏఎస్‌సీఓసీ నిర్ణయాన్ని అంగీకరించబోమన్న బోర్డు
South African Olympic body removes CSA board

కరోనా సంక్షోభం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్న ప్రపంచ క్రికెట్‌లో ఇదో పెద్ద కుదుపు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్ఏ)ను ఆ దేశ ఒలింపిక్ బాడీ.. దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ అండ్ ఒలింపిక్ కమిటీ (ఎస్ఏఎస్‌సీఓసీ) నియంత్రణలోకి తీసుకుంది. ఆ వెంటనే పదవుల నుంచి తప్పుకోవాలంటూ బోర్డు సభ్యులను ఆదేశించింది. బోర్డులో జాతివివక్ష, అవినీతి, అధికార దుర్వినియోగం వంటివి క్రికెట్ ప్రతిష్ఠను దిగజార్చాయని పేర్కొన్న ఒలింపిక్ కమిటీ బోర్డు వ్యవహారాలపై దర్యాప్తు కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే అవినీతి, జాతి వివక్ష ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఒలింపిక్ కమిటీ నిర్ణయం శరాఘాతం కానుంది. ఎస్ఏఎస్‌సీఓసీ తాజా నిర్ణయం కారణంగా సీఈవో కుగాండ్రీ గోవేందర్, కంపెనీ కార్యదర్శి వెల్స్ గ్వాజా, తాత్కాలిక సీసీవో థేమీ తెంబు వంటి వారు దూరం కానున్నారు. దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో తబాంగ్ మోన్రోపై గత నెలలోనే వేటుపడగా, ఆ వెంటనే తాత్కాలిక సీఈవో జాక్వెస్ ఫాల్, అద్యక్షుడు క్రిస్ నెంజానీ రాజీనామా చేశారు. అయితే, ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని అంగీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది.

More Telugu News